రామచంద్రాపురం, సెప్టెంబర్ 2 :పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ను నిండుమనస్సుతో ఆశీర్వదించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.60లక్షలు విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పగా చెప్పుకునే బీజేపీ ఏ రాష్ట్రంలోనైన ఈ విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించిందా.? అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ర్టాల్లో అన్ని ట్రబుల్స్ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అబద్ధపు మాటలకు ప్రజలు మోసపోవద్దని, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదించాలన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో నిర్మించిన 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కొల్లూర్-1 ప్రాజెక్ట్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్లతోపాటు శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన 3500 మంది లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, జాఫర్ హుస్సేన్, రాజాసింగ్లతో కలిసి మంత్రి హరీశ్రావు లబ్ధిదారులకు 2బీహెచ్కే ఇంటి పట్టాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలు వస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు రావడంతో అందరి ముఖాల్లో అంత సంతోషం కన్పిస్తుందన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్లో రూ.9వేల కోట్లతో లక్ష ఇండ్లను కట్టించిందన్నారు. మొదటి విడుతలో భాగంగా 11,700 ఇండ్లను పంపిణీ చేశామని, కొల్లూర్లోనే 3500 ఇండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని లబ్ధిదారులకు ప్రతినెలా ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్ని ప్రభుత్వం కొల్లూర్లో సకల సౌకర్యాలతో నిర్మించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.60వేలు ఇచ్చేవారని, అందులో రూ.20వేలు సబ్సిడీ ఇచ్చి రూ.40వేలు తిరిగి కట్టించుకునే వారని గుర్తు చేశారు. హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని చెప్పారు.
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లల్లో స్థానికులకు పదిశాతం కేటాయిస్తామని చెప్పారు.