జూబ్లీహిల్స్, జనవరి 22: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి పెద్ద ఎత్తున వితరణ అందించారు. హైదరాబాద్ సర్కిల్ ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్, సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, డీజీఎం సీడీఓ జితేంద్ర కుమార్ శర్మ, లెఫ్టినెంట్ కమాండర్ అతుల్య ఆనంద్లతో కలిసి రూ.34,16,750/- చెక్కును గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్కు సోమవారం అందజేశారు.
సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి చైర్ పర్సన్గా కూడా ఉన్న గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పలువురికి స్ఫూర్తినిచ్చేలా ఎస్బీఐ ఉద్యోగులు చేపట్టిన మహోన్నత కార్యానికి అభినందనలు తెలిపారు. ఎస్బీఐ సీజీఎం రాజేశ్ కుమార్ మాట్లాడుతూ ఎస్బీఐలో సమాజానికి, దేశానికి తిరిగి ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల పురోభివృద్ధికి దోహదపడతామన్నారు. కఠోరమైన వాతావరణంలో దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికులకు మద్దతు ఇచ్చే విషయంలో ఎస్బీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.