Fish Prasadam | అబిడ్స్, జూన్ 8 : మృగశిర కార్తె సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించనున్నారు. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు నగరంతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు. చేపప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఇప్పటికే బారులు తీరారు. శుక్రవారం ఉదయం పంపిణీని పకడ్బందీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గురువారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ మైదానంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జాయింట్ కమిషనర్ విశ్వ ప్రసాద్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. మత్స్యశాఖ ఆరు లక్షల చేప పిల్లలను సిద్ధంగా ఉంచి అవసరమైన మేరకు ఎగ్జిబిషన్ మైదానానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కిటకిటలాడిన మైదానం …
ఎగ్జిబిషన్ మైదానానికి ఉబ్బస వ్యాధిగ్రస్తులు, వారి సహాయకులు భారీగా తరలిరావడంతో మైదానం కిటకిటలాడింది. మైదానికి చేరుకున్న వారికి ఫలహారాలు, భోజన సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాయి. క్యూలైన్లలో జనం నిండిపోయారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.