Mee Seva | సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ( Birth, Death Certificates ) మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ ( GHMC ) సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) ప్రొసీడింగ్స్ లేకుండానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి.
ఇన్స్టంట్ అఫ్రూవల్ను అవకాశంగా మార్చుకొని తెల్ల కాగితాలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులు నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు గుర్తించి 22,954 నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. జనన, మరణాల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల డిజిటల్ సంతకాలను మీ సేవా కేంద్రాలు దుర్వినియోగం చేసినట్లు ఈవీడీఎం విభాగం తేల్చింది. ఈ మేరకు అఫ్జల్గంజ్, ముషీరాబాద్, అంబర్పేట, అసిఫ్నగర్, బహదూర్పుర, చార్మినార్, గోల్కొండ, కాచిగూడ, సైదాబాద్, యాకత్పుర, మల్కాజిగిరి, సరూర్నగర్, నల్లకుంట, తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోని 50 మీ సేవా కేంద్రాలలో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు పేర్కొంటూ కమిషనర్ లోకేశ్కుమార్కు నివేదిక సమర్పించారు. దీంతో పాటు సాఫ్ట్వేర్లోను లోపాలున్నాయని, తక్షణ సవరణ చేయాలని సిఫారసు చేశారు. విచారణ రిపోర్టు ఆధారంగా కమిషనర్ నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన ఆయా మీ సేవా కేంద్రాల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని నాలుగు పోలీస్స్టేషన్లలో తొలుత క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. విడతల వారీగా 50 మీ సేవా సెంటర్ల నిర్వాహకులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేయనున్నారు. ఇక మీ సేవా కేంద్రాల సిబ్బందితో జత కట్టిన ఇంటి దొంగలపై కమిషనర్ ఫోకస్ పెట్టారు. వైద్యావిభాగం పరిధిలో ఏళ్ల తరబడి ఉంటున్న వారితో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై బదిలీలు, సస్పెన్షన్ వేటు వేసేలా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.