మేడ్చల్, జనవరి 2 : మూడేండ్లకే చిన్నారి ఆయుష్షు తీరింది. మృత్యుపాశమైన ట్రాక్టర్… ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కబళించింది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక చెక్పోస్టు ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… బతుకుదెరువు కోసం మేడ్చల్ పారిశ్రామిక చెక్పోస్టు ప్రాంతానికి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబంతో సహా వలస వచ్చాడు.
వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు లక్ష్మణ్ కూతురు ఆద్య(3) సోమవారం ఉదయం ఆడుకుంటున్నది. ఆ సమయంలో అటుగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆద్యను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ దనావత్ నాగేశ్ అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి, చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైనట్టు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నవీన్ రెడ్డి తెలిపారు.