మాదాపూర్, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వై.సతీశ్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన రెన్యుఎక్స్ ఎక్స్ పో 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి విచ్చేసి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ సునీల్ శర్మ, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి, రెన్యూవబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, రాష్ట్ర మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పవర్ అండ్ యుటిలిటీస డైరెక్టర్ భాగ్యతేజ్రెడ్డి, ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేశ్ ముద్రాస్తోపాటు జానయ్యలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రెన్యూవబుల్ ఎనర్జీని పెంపొందించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ వాహనాలు, రవాణా వినియోగానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించినట్లయితే ప్రభుత్వం వ్యయాన్ని కొంత వరకు ఆదా చేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేండ్లలో 11 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 100 శాతం గ్రీనరీని పెంపొందించే దిశగా అడుగులు వేస్తూ రెన్యూవబుల్ ఎనర్జీని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరు సోలార్ వినియోగంపై దృషి సారించాలన్నారు. తెలంగాణలో 2022 వరకు 254 శాతం రెన్యూవబుల్ ఎనర్జీని ఛేదించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహిస్తుందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 500 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 2025 వరకు 3వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఐఏఎస్ సునీల్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలు అంతకంతకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ఇంధన వినియోగం లేకుండా ఉంటుందన్నారు.
2040 వరకు దేశ వ్యాప్తంగా 100 శాతం రెన్యూవబుల్ ఎనర్జీయే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలు అంతకంతకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని, ప్రతి ఒక్కరు ఈవీ వాహనాలను వినియోగించినట్లయితే పెట్రోల్, డీజిల్తో పనిలేకుండా చేసుకోవచ్చన్నారు. ఇంట్లో సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసుకోవాలని, సోలార్ రూఫ్ టాప్లతో 50 శాతం వరకు కరెంట్ను ఆదా చేసుకున్న వారమవుతామన్నారు. సోలార్ ఎనర్జీ వ్యవసాయ రంగంతోపాటు సోలార్ను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుందని, ప్రభుత్వాలు సబ్సిడీని సైతం అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో ఇన్వర్టర్లు, ఛార్జ్ కంట్రోలర్లు, ఈపీసీ కంపెనీలు, హైబ్రిడ్ సిస్టమ్లు, మానిటరింగ్ సిస్టమ్లు, బ్యాటరీలు, టెస్టింగ్, బయో ఎనర్జీ, ఆర్ఈ సెక్టార్లు, ప్రాజెక్టు డెవలపర్లతోపాటు పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.