హైదరాబాద్ : మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన షానవాజ్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీసు స్టేషన్కు తరలించి విచారించినట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురి ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. సర్వర్ హ్యాక్తో ఇద్దరికీ సంబంధం లేదని పోలీసులు తేల్చారు. వినోద్, నవీన్ ఖాతాల్లో సైబర్ నేరగాళ్లు నగదు జమ చేశారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా జమచేశారు. ఆ తర్వాత ఇద్దరి ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఇక.. షానవాజ్ ఖాతాలో రూ.6.9 కోట్లు జమ చేశారు. ఆమె ఈ నెల 11నే అకౌంట్ తెరిచింది. దీంతో హ్యాకర్లతో ఆమెకు సంబంధాలుండే అవకాశాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
షానవాజ్ ఖాతా నుంచి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. షానవాజ్ కొన్ని నెలల క్రితం ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. సైబర్ క్రిమినల్స్కు షానవాజ్ సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 ఖాతాల నుంచి రూ.12.4 కోట్లు 128 ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేశారు. మరో 200 ఖాతాలకు నగదు బదిలీ కావచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.