సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షేత్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతుండగా, మరోవైపు మెట్రో రైలు కోచ్ల డిజైన్, వాటి తయారీపై మెట్రో అధికారులు దృష్టి సారించారు. మొదటి దశలో నిర్మించిన మెట్రో రైలు ప్రాజెక్టు కంటే మరింత అత్యాధునికంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు.
ఒకేసారి 120 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో రైలును 3 కోచ్లతో ఉండేలా డిజైన్ చేస్తున్నామని, ప్రాథమికంగా 10 రైళ్లను ఒకేసారి తయారు చేయించనున్నట్లు, భవిష్యత్తులో 6 కోచ్లతో ఉండే రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా మెట్రో స్టేషన్ల నిర్మాణం ఉంటుందని మెట్రో అధికారి ఒకరు తెలిపారు. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ఉన్న 31 కి.మీ దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకునేలా ట్రాక్ను డిజైన్ చేస్తున్నారు. ఎయిర్పోర్టు మెట్రో మార్గంలో రద్దీ సమయాల్లో ప్రారంభంలో ప్రతి 8 నిమిషాలు, అవసరమైతే ప్రతి 2.5 నిమిషాలకు ఒక రైలును నడిపేందుకు వీలుగా, అదేవిధంగా మిగతా సమయాల్లో ప్రతి 20 నిమిషాలకో మెట్రో రైలు నడుపనున్నారు.