హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను పైడమ్మ(40), కుమారుడు కాళి కృష్ణ(22), కూతురు శ్రీవల్లి(18)గా గుర్తించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఈ ముగ్గురు నివాసముంఉటున్నారు. తల్లి, కుమార్తె అపురూప కాలనీలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు దూలపల్లిలోని ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం తమ విధులు ముగించుకున్న ఆ ముగ్గురు దూలపల్లి నుంచి ఇందిరమ్మ కాలనీకి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.