అడ్డగుట్ట, జూలై 15 :ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ సికింద్రాబాద్ జోన్ పరిధిలో మంచి సత్ఫలితాలనిస్తుంది. హైదరాబాద్ నగరంలోని కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ సర్కిల్, జోనల్ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు ఫిర్యాదులు చేయడం… ఆ సమస్యలను పరిష్కరించడంలో కాస్త కాలయాపన జరగడం పరిపాటిగా ఉండేది. మంత్రి కేటీఆర్ ఆలోచనతో పురుడుపోసుకున్న వార్డు కార్యాలయాలపై ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతుంది. అన్ని విభాగాల అధికారులు ఒకేచోట అందుబాటులో ఉండడం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమిషాల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వార్డులవారీగా ఏ చిన్న సమస్య ఉన్నా స్థానికంగా అందుబాటులో ఉన్న వార్డు కార్యాలయాలకు వెళ్లి బస్తీ, కాలనీల ప్రజలు సమస్యలను అధికారులకు విన్నవించుకోవడం… అధికారులు వెంటనే సదరు సమస్యలపై స్పందించి తక్షణమే పరిష్కరిస్తుండడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ, వీధిదీపాలు,పారిశుద్ధ్ద్య సమస్యలే అధికం
డివిజన్ల వారీగా వార్డు కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యలే అధికంగా ఉన్నాయి. వీటితో చెట్టుకొమ్మల తొలగింపు తదితర సమస్యలపై అధికారులు ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది. సికింద్రాబాద్ జోన్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండగా అందులో 27 వార్డు కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రజల నుంచి జోన్ పరిధిలో 296 ఫిర్యాదులు రాగా.. తక్షణమే స్పందించిన అధికారులు 234 సమస్యలను వెనువెంటనే పరిష్కరించగా…ఇంకా కేవలం 62 సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. వార్డు కార్యాలయంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో పాటు యూసీడీ, వీధిదీపాలు, హార్ట్టికల్చర్, ఎంటమాలజీ, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, జలమండలి, కంఫ్యూటర్ ఆపరేటర్తో పాటు అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారు.
మెరుగైన పాలనే లక్ష్యంగా…
ప్రజలకు నూటికి నూరుశాతం మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే దాదాపుగా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాము. ఇప్పటివరకు జోన్ పరిధిలో 296 ఫిర్యాదులు రాగా 80 శాతం ఫిర్యాదులను పక్కా ప్రణాళికతో పరిష్కరించాం. మిగతా ఫిర్యాదులకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రజలకు వార్డు కార్యాలయాలపై, అందులో అందించే సేవలపై అవగాహన కల్పిస్తున్నాం.
– ఎన్.రవికిరణ్, జోనల్ కమిషనర్, సికింద్రాబాద్