కేంద్రం ఆధీనంలోని బోర్డువాసులకు సర్కారు చేయూత
నెలకు రూ.కోటికి పైగా భారం
దాదాపు 35 వేల కుటుంబాలకు లబ్ధి
ఉచిత తాగునీటి సరఫరాకు సీఎం కేసీఆర్ సుముఖత
ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సికింద్రాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్.. నగరంలో అంతర్భాగమై కేంద్రం ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఇక్కడి వారి సంక్షేమం, అభివృద్ధి పనులను బోర్డు పర్యవేక్షిస్తుంటుంది. భౌగోళికంగా గ్రేటర్ పరిధిలో ఉన్నప్పటికీ…సాంకేతికంగా కేంద్ర రక్షణ శాఖ అజమాయిషీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి,సంక్షేమ ఫలాలు బోర్డు పరిధిలో అర్హులు పొందలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటినందిస్తున్నారు. అయితే బోర్డు పరిధిలో కూడా ఉచితనీటి పథకాన్ని అమలు చేయాలని శుక్రవారం కార్మిక మంత్రి మల్లారెడ్డి, పార్టీ నాయకులు సీఎంకు విన్నవించగా, సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశముంది.
గతేడాది చివర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా స్వయానా సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రేటర్ హైదరాబాద్వ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా దాదాపు 8.50 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. అయితే భౌగోళికంగా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ… సాంకేతికంగా కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉంటుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కల్పించే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిగా బోర్డు పరిధిలోని అర్హులు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డుకు రోజూ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని జలమండలి తాగునీటిని సరఫరా చేస్తున్న దరిమిలా ఈ ఉచిత తాగునీటి పథకం అమలుకు బోర్డు కూడా సుముఖంగానే ఉంది. దీంతో ఈ ప్రతిపాదనలపై మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, ఇతర బోర్డు సభ్యులు పలువురితో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు తెలిసింది. గ్రేటర్లో చుట్టూ ఈ హామీని అమలు చేసి, మధ్యలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులోని వారిని విస్మరించవద్దనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు బోర్డు పరిధిలో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.
ఆది నుంచి ఆదుకుంటున్న సర్కారు
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 35,490 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకుగాను పదకొండు రిజర్వాయర్లు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ జలమండలి బల్క్గా తాగునీటిని సరఫరా చేస్తుంది. నెలకు 50 లక్షల గ్యాలన్ల నీటిని ఒక కిలో లీటరు (వెయ్యి లీటర్లు) రూ.14 చొప్పున తారీఫ్తో సరఫరా చేస్తుంది. ఇంతకు మించి నీటిని తీసుకోవాల్సి వస్తే… ప్రతి అదనపు కిలో లీటరుకు రూ.54 వసూలు చేయనున్నారు. ఈ మేరకు జలమండలి-కంటోన్మెంట్ బోర్డు 2009లోనే ఒప్పందం చేసుకుంది. కాగా బోర్డు పరిధిలోని బస్తీల్లో ఉన్న నల్లా కనెక్షన్ల నుంచి నెలకు రూ.280, కాలనీల్లోనైతే నెలకు రూ.450 గృహ వినియోగదారుల నుంచి బోర్డు వసూలు చేస్తుంది. ఇందులో 35 శాతం మురుగునీటి పన్ను కూడా ఉంటుంది. అయితే మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి బోర్డు పరిధిలోని వారికి కూడా పుష్కలమైన తాగునీరు అందించేందుకు నెలసరి సరఫరా పరిమాణాన్ని 50 మిలియన్ గ్యాలన్ల నుంచి 70 మిలియన్ గ్యాలన్లకు పెంచారు. ఈ క్రమంలో నెలకు రూ.1.06 కోట్ల వరకు బిల్లులు చెల్లిస్తుంది. అయితే ఉచిత తాగునీటి పథకం అమలుతో బోర్డు జలమండలికి చెల్లించే ఈ మొత్తంతో పాటు మురుగునీటి నిర్వహణ బాధ్యతను కూడా చేపట్టాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు కోటిన్నర రూపాయల వరకు జలమండలికి చెల్లించాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.