సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. నగరంలో ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించామని, మిగిలిన డివిజన్లలో సమావేశాలను ఈనెల 24వ తేదీ లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
25న నిర్వహించే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశానికి ఆయా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులంతా హాజరు కావాలన్నారు. తొలుత నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిషరించి సమావేశానికి హాజరు కావాలని మాగంటి చెప్పారు. సమావేశం నిర్వహణకు సంబంధించి సమగ్రమైన ఎజెండాను సిద్ధం చేయాలని, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనులను తెలియజెప్పే విధంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో ప్రగతి నివేదికను వివరించాలని మాగంటి గోపీనాథ్ సూచించారు.