చార్మినార్, సెప్టెంబర్ 6 : గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతనగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దక్షిణ మండల వ్యాప్తంగా సుమారు 1700 వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా మరో 200 విగ్రహాలను ప్రతిష్టించారు. శుక్రవారం నిర్వహించే సామూహిక గణేశ్ నిమజ్జనం కోసం వివిధ విభాగాల సమన్వయంతో వేడుకలు ప్రశాంతంగా కొనసాగడానికి చర్యలు తీసుకున్నాం. ఓ కంపెనీ ఆర్ఏఎఫ్ బలగాలతోపాటు వివిధ పోలీస్ విభాగాలతో కలిసి 2500 మంది పోలీసులు ఊరేగింపు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని తెలిపారు.
ఊరేగింపు కొనసాగే దారిలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతోపాటు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి కదలికను గమనించనున్నాం అన్నారు. ప్రతి వినాయక మండపం నుంచి తరలించే వాహనాల్లో బందోబస్తుగా పోలీసు సిబ్బందిని కేటాయించనున్నాం తెలిపారు. నిమజ్జనం అనంతరం తిరిగి వాహనం చేరుకునే వరకు పోలీసులు భద్రతను అందించనున్నారని డీసీపీ తెలిపారు. ఊరేగింపులో డీజేలకు అనుమతులు లేవని, ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దక్షిణ మండలం నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి సర్దార్ మహల్లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, నగరంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు తదనుగుణంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు.
సామూహిక ఊరేగింపులో మహిళల భద్రత కోసం సివిల్లో మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగడానికి ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని డీసీపీ సాయిచైతన్య సూచించారు. వదంతులను ప్రచారం చేసే వారిపై డిజిటల్ నిఘా కొనసాగుతుందని, అలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. పాతనగరంతోపాటు నగరం ప్రశాంత వాతావరణంలో ఉందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని తెలిపారు.