మేడ్చల్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 176 పాఠశాలలను ఎంపిక చేయగా, ఇందులో 25 పాఠశాలల్లో అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. జిల్లాలో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో పీఎస్లు 375, యూపీఎస్లు 22, ఉన్నత పాఠశాలలు 108 ఉండగా 96,050 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు సర్కారు ఖర్చు చేస్తున్నది.
36 పాఠశాలలకు టెండర్ ప్రక్రియ పూర్తి..
రూ. 30 లక్షల పైచిలుకు నిధులు ఖర్చయ్యే 36 పాఠశాలల టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. 19 పాఠశాలలకు టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభం కాగా మరో 17 పాఠశాలల్లో పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేసిన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. మరో 115 పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేశారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు
మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు అన్ని రకాల వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్కారు బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడింది. అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను త్వరలోనే ప్రారంభించనున్నాం.
– చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
ప్రగతినగర్ ప్రైమరీ పాఠశాలకు కొత్త సొబగులు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రగతినగర్ ప్రైమరీ పాఠశాల రూపురేఖలు మారాయి. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 29 లక్షల 88 వేలను ప్రభుత్వం కేటాయించి 12 రకాల మౌలిక వసతులు చేపట్టింది. దీంతో విద్యార్థులకు సౌకర్యంగా మారింది. పాఠశాల ఆవరణలో పెంచిన మొక్కలు కూడా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు పలు వసతులు కల్పిస్తున్నది. దీంతో ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది.
– కుంట మల్లేశ్, ఎస్ఎంసీ చైర్మన్, అలియాబాద్
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. దీనికి తోడు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించడంతో పాఠశాలలో చేరే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతున్నది. ప్రైవేట్ పాఠశాలలో లేని విధంగా డిజిటల్ క్లాసులు, లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులతో విద్యార్థులకు పలు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
– పద్మ, ఎంపీపీఎస్, ప్రధానోపాధ్యాయురాలు
పిల్లల తల్లిదండ్రులకు పూర్తిగా నమ్మకం
ప్రభుత్వ పాఠశాలలపై పిల్లల తల్లిదండ్రులకు పూర్తి నమ్మకం ఏర్పడింది. గతంలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులు నేడు సర్కారు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని రకాల వసతులను కల్పిస్తూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి.
– రంగాచారి, గుండ్లపోచంపల్లి, ప్రధానోపాధ్యాయుడు
క్యూ కడుతున్నారు..
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. దీంతో సర్కారు పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే ఇష్టపడని తల్లిదండ్రులు ఇప్పుడు చేర్పించడం సంతోషంగా ఉంది. మన ఊరు-మనబడి ద్వారా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతో బడులను చూసి పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– హరీశ్, అత్వెల్లి పాఠశాల, ఉపాధ్యాయుడు
ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సర్కారు తీర్చిదిద్దుతున్నది. నాణ్యమైన చదువుతో పాటు విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు మించి సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ముందుకు వస్తున్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది.
– రాజీగళ్ల నర్సింహ, ఎస్ఎంసీ చైర్మన్