హైదరాబాద్ : హైదరాబాద్లోని బాచుపల్లి ఎస్ఎల్జీ ఆస్పత్రికి భారీగా జరిమానా విధించారు. రూ. 24 కోట్ల భారీ జరిమానా విధించినట్లు నిజాంపేట నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఆస్తి పన్ను స్వీయ మదింపులో తప్పుడు వివరాలు ఇచ్చారని జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఆస్తి పన్ను తప్పుడు వివరాలు ఇచ్చినందుకు రూ. 24 కోట్ల జరిమానా విధించామని తెలిపారు.
బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రి 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందుకు గాను 2 సెల్లార్లు+ గ్రౌండ్ ఫ్లోర్+9 అంతస్తులకు అనుమతి ఉంది. అయితే వాస్తవానికి 10 లక్షల చదరపు గజాల్లో నిర్మాణ అంతస్తులు ఉండగా.. తాము కేవలం 4 అంతస్తుల్లో 32,300 చదరపు గజాలుగా పేర్కోంటూ ఇటీవల ఇంటర్నెట్ ద్వారా యాజమాన్యం సెల్ఫ్ అసిస్మెంట్ కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన నిజాంపేట నగర పాలక సంస్థ అధికారులు సదరు వివరాలు తప్పుగా ఉన్నాయని పేర్కొంటూ రూ. 24 కోట్లకు పైగా జరిమానా విధించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం.. దరఖాస్తుదారుడు స్వీయ ఆస్తిపన్ను మదింపులో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే సదరు ఆస్తి విలువకు 25 రెట్ల జరిమానా విధిస్తారు. ఆ ప్రకారం.. ఆ ఆసుపత్రికి రూ. 24 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.