హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మార్పులు చేస్తాం.. 22ఏ జాబితా నుంచి విడిపించి భూ సమస్యలను పరిష్కరిస్తాం అని నమ్మించిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం విధానపరమైన లోపాలు, గందరగోళంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఏకపక్షంగా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, నిరసనలు వెల్లువెత్తితే మౌఖిక ఆదేశాలతో తొలగింపు నాటకాలు ఆడటం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతున్నది. పక్కా మార్గదర్శకాలు లేకుండా కేవలం అధికారుల నోటి మాటలతో ప్రక్రియ నడుస్తుండటంతో క్షేత్రస్థాయిలో భూ యజమానులు తలలు పట్టుకోవాల్సి వస్తున్నది. అధికారుల చుట్టూ తిరిగితే తప్ప 22ఏ నుంచి తొలగింపు ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు జనాలపై వాలిపోయి.. సమస్య పరిష్కారం కావాలంటే చేతులు తడపాల్సిందే అని బాహాటంగానే వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని బుద్ధానగర్ సర్వే నంబర్ 39, 43, 44లో దాదాపు 80 ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చింది. దశాబ్దాల క్రితమే అక్కడ ఇండ్లు, అపార్ట్మెంట్లు నిర్మితమై కుటుంబాలు నివాసముంటున్నా.. సర్కార్ రాత్రికిరాత్రే ఆ భూములపై నిషేధాజ్ఞలు విధించింది. ప్రజలు తిరుగబడటంతో తొలగింపు ప్రక్రి య మొదలైనప్పటికీ, అందులోనూ కాంగ్రెస్ సర్కార్ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నది. అపార్టుమెంట్లలో ఉన్న దాదాపు 90 శాతం ఫ్లాట్లకు విముక్తి కల్పించిన యంత్రాంగం.. ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది.
ఘట్కేసర్ మండలం అవుషాపూర్ పరిధిలోని సర్వే నంబర్లో 279, 282, 283లో దాదాపు 150 ఎకరాల భూమిని 22ఏ జాబితాలో చేర్చడం వెనుక ప్రభుత్వ విధానపరమైన లోపం స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఇందులో యూఎల్సీ పరిధిలోకి వచ్చేది కేవలం 18 ఎకరాల్లోపే. కానీ కాంగ్రెస్ సర్కార్ బాధ్యతారాహిత్యం వల్ల ఏకంగా 150 ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. అయితే తమ ఆస్తులకు యూఎల్సీ నిబంధనలు వర్తించవని ఓపెన్ ప్లాట్ల యజమానులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం 18 ఎకరాల పేరు చెప్పి… ఏండ్ల క్రితమే కొనుగోలు చేసిన 1,400 ప్లాట్ల యజమానుల హక్కులను కాలరాస్తున్నదని మండిపడుతున్నారు.
తమ సొంత స్థలాలకే హక్కులు లేకుండా పోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూ యజమానులు, ప్లాట్ల ఓనర్లు రోడ్డెక్కుతున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ వారాల తరబడి తిరిగినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులను తక్షణమే తొలగించాలని, అపార్టుమెంట్లు, ఓపెన్ ప్లాట్లు అనే సంబంధం లేకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.