TSRTC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో సిటి ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2,200 సిటీ బస్సులు మేడారం జాతరకు కేటాయించారు. దీంతో ఈ నెల 20 నుంచి 25 వరకు నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్లు, ఆర్డీనరీ బస్సులు కనిపించే ప్రసక్తే ఉండదు. కేవలం నగరంలో ఉన్న అద్దె బస్సులే ఉంటాయి.
దీంతో ఆ ఆరు రోజుల పాటు నగర ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి అనేక ఇక్కట్లు ఎదుర్కొనక తప్పదని తెలుస్తుంది. మరో వైపు హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి గ్రేటర్ జోన్ నుంచి కూడా లక్షల సంఖ్యలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనపు చార్జీలు వసూలు చేసే అంశం ప్రభుత్వం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.