సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. అంతే కాకుండా గడువు తీరిన 77బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి సీహెచ్.విజయ్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన అజింక్య పండరీ విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి, ధూల్పేటలోని మహేందర్సింగ్కు విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగా వైజాగ్ నుంచి కొనుగోలు చేసిన రూ.5.55 లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయిని మహేందర్సింగ్కు అందజేసేందుకు యత్నిస్తుండగా.. సమాచారం అందుకున్న జిల్లా డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కంచర్ల కరుణారెడ్డి, ధూల్పేట ఎక్సైజ్ బృందాలతో కలిసి శుక్రవారం పండరీని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి గంజాయితోపాటు రవాణాకు వినియోగించిన మారుతి కారును సీజ్ చేశారు. మరో కేసులో గడువు తీరిన బీర్లను విక్రయించడమే కాకుండా రికార్డులు సరిగ్గా మెయింటెయిన్ చేయని పీవీకే ఫుడ్ చైన్ బార్ అండ్ రెస్టారెంట్పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో గడువు తీరిన 77కింగ్ ఫిషర్ బీర్లను(25.41లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా సమయపాలన పాటించని బాలాజీ పవన్ దాబా అండ్ రెస్టారెంట్, రాజా రెస్టారెంట్ అండ్ బార్లపై కూడా కేసులు నమోదు చేసినట్లు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కరుణారెడ్డి తెలిపారు. దీంతోపాటు గడిచిన ఐదు రోజుల్లో మొత్తం 11 కేసులు నమోదు చేసి, 7 మందిని అరెస్టు చేశామని, సుమారు రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 అక్రమ మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ సీహెచ్.విజయ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కంచర్ల కరుణారెడ్డితోపాటు ధూల్పేట, నాంపల్లి, గోల్కొండ, చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.