సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ) : ఔటర్ రింగు రోడ్డులో 21వ ఇంటర్చేంజ్ అందుబాటులోకి వచ్చింది. 158 కిలోమీటర్ల రహదారిలో నిర్మాణ సమయంలో 19 ఇంటర్చేంజ్లతో అందుబాటులోకి వచ్చిన ఔటర్ ప్రాజెక్టు ..రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ, స్థానికుల డిమాండ్ల దృష్ట్యా కొత్తగా ఇంటర్ఛేంజ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే 20వ ఇంటర్చేంజ్ నార్సింగి వద్ద ఇటీవల అందుబాటులోకి రాగా.. తాజాగా మల్లంపేట ఇంటర్చేంజ్ను గురువారం అధికారులు ప్రారంభించి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు.
రూ.45 కోట్లతో నిర్మించిన ఈ ఇంటర్చేంజ్ నుంచి మల్లంపేట మీదుగా బాచుపల్లి, నిజాంపేట జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు కూడా హెచ్ఎండీఏనే చేపడుతోంది. దీంతో ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు నెట్వర్క్తో ప్రయాణం సాఫీగా సాగనుంది. త్వరలో కోకాపేట 22వ ఇంటర్చేంజ్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు పనులను వేగిరం చేశారు.