సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ ): రాత్రి సమయంలో ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న వాహనాలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎక్కడపడితే అక్కడ నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కలిగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా, అందులో ప్రమాదకరంగా తరలిస్తున్న 21 వాహనాలను సీజ్ చేసి, రూ. 6 లక్షల మేర జరిమానా విధించారు. నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న 5, నిర్మాణ వ్యర్థాలు తరలిస్తున్న 16 వాహనాలను సీజ్ చేశారు. మదీనాగూడ నుంచి బండ్లగూడ, లింగంపల్లి నుంచి పటాన్చెరువు, ఐకియా నుంచి గోల్రెడ్డి తండా, గచ్చిబౌలి నుంచి గోల్రెడ్డి తండా, షేక్పేట నుంచి కాళీ మందిర్, హిమాయత్నగర్, మాసబ్ట్యాంక్ నుంచి రాజేంద్రనగర్ మార్గాల్లో నిఘా పెట్టిన ఈవీడీఎం విభాగం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ వ్యర్థాలు, సామగ్రిని తరలిస్తున్న వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలకు మొదటిసారి తప్పిదం చేస్తే రూ. 25వేలు , రెండోసారి రూ.50వేలు, మూడోసారి పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ ఎన్.ప్రకాశ్ రెడ్డి తెలిపారు.