మండల సభలో ఏకగ్రీవ తీర్మానం
వరుసగా మూడు సభలకు హాజరుకాని అధికారుల సరెండర్కు నివేదిక
చేర్యాల, మార్చి 31 : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే, వాటిని క్షేత్రస్ధాయిలో అమలు చేయాల్సిన మహిళా సంఘాల సీఏలు నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. వెంటనే మహిళా సంఘాల సీఏల పై సమగ్ర విచారణ చేపట్టాలని చేర్యాల మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన జరిగింది. విద్యుత్ శాఖ పై చర్చ జరుగుతున్న సమయంలో సర్పంచ్ చీపురు రేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యల పై సీఎం కేసీఆర్ స్పందించాలా ? అధికారులు, సిబ్బందికి ఎలాంటి బాధ్యత లేదా అన్ని ప్రశ్నించారు. ఎంపీటీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.
ఐకేపీ శాఖ పై చర్చ జరుగుతున్న సమయంలో సీఏలు మహిళల వద్ద వేలాది రుపాయాలు దండుకుంటున్నారని సర్పంచ్లు ఆరోపించారు. మహిళా సంఘాల రుణాల మంజూరు వారి పొదుపుతో పాటు సీఏలు వసూళ్ల పై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మండల సభకు హాజరుకాని అధికారుల పై చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు, ఎంపీటీసీలు డిమాండ్ చేయడంతో ఆరోగ్య వైద్యశాఖ, అటవీశాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఆర్టీసీ, ఎక్సైజ్ శాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో తారిఖ్ అన్వర్ సభలో ప్రకటించారు. గడిచిన మూడు సర్వసభ్య సమావేశాలకు అసలు హాజరుకాని ప్రభుత్వ శాఖల అధికారులను సరెండర్ చేయాలని కోరుతూ కలెక్టర్కు నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్శాఖ అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులు తీసుకునే విధంగా ఎంఈవో కృషి చేయాలని కోరారు. ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ మాట్లాడుతూ మినీ అసెంబ్లీగా పేరున్న మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు, సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ రైస్, చిట్టి ముత్యాలు, సుగంధ వాసన వెదజల్లే బియ్యం సాగు పై జక్కుల తిరుపతి మండల సభలో ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, ఎంపీవో నంద కిశోర్, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డితో పాటు సర్పంచ్, ఎంపీటీసీలు, కార్యదర్శులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.