సూర్యాపేట, నమస్తే తెలంగాణ/సూర్యాపేట : జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి ముందు ప్రేక్షకుల గ్యాలరీ కూలిపోయిన వెంటనే సూర్యాపేట వాసులు స్పందించిన తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి సుమారు 2వేల మంది ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ కూలిపోగా.. ప్రతి ఒక్కరూ తక్షణమే స్పందించి తమ వంతు సాయం అందించారు. క్షతగాత్రులను నిమిషాల వ్యవధిలో దవాఖానలకు చేర్చారు. పోలీసులు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులే కాదు.. సామాన్య ప్రజలు సైతం స్పందించారు. క్షతగాత్రులను ఎత్తుకొని వాహనాల్లోకి ఎక్కించారు. మల్లయ్య అనే డ్రైవర్ పెట్రోల్, చార్జీలు ఆలోచించకుండా ముగ్గురు క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ దవాఖానకు తీసుకుపోయాడు. మరోవైపు పోలీస్, రాజకీయ నాయకుల వాహనాలన్నీ అంబులెన్స్లుగా మారిపోయాయి. ఎవరికి వారు క్షతగాత్రులను తరలించడంలో తమ వాహనాలను ఉపయోగించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
స్పందించిన వైద్యులు..
దవాఖానకు వెళ్లాలంటే డాక్టర్ ఫీజు మొదలుకొని ఎక్స్రేలు, స్కానింగ్లు, మందుల పేరిట ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, మంత్రి జగదీశ్రెడ్డి రిక్వెస్ట్ మేరకు సూర్యాపేటలోని ప్రతి దవాఖానలో క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించారు. కోదాడ, హుజూర్నగర్, నకిరేకల్ నుంచి వైద్య సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి సేవలు అందించారు. ప్రాణనష్టం లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తిస్థాయిలో చికిత్స
గ్యాలరీ కుప్పకూలడం దురదృష్టకరం. మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు క్షతగాత్రులందరికీ పూర్తిస్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 30మందికి పరీక్షలు చేసి ఇద్దరికి ఆపరేషన్లు చేశాం. మరో 10మందిని హైదరాబాద్ దవాఖానలకు రెఫర్ చేశాం.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం : మంత్రి జగదీశ్రెడ్డి
గ్యాలరీ కూలిపోయి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, వైద్య ఖర్చులు తానే భరిస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం సూర్యాపేట జనరల్ దవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఆయన మరోమారు పరామర్శించి మాట్లాడారు. గాయపడిన వారు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారన్నారు. ప్రమాద సమయంలో సహాయక చర్యలు చేపట్టిన సూర్యాపేట ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, మార్కెట్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ్ నాయక్, నాయకులు ఉప్పల ఆనంద్, బైరు వెంకన్న, అయూబ్ఖాన్, చింతలపాటి భరత్, రాపర్తి శ్రీను ఉన్నారు.
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం
గాయపడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నాం. మంత్రి జగదీశ్రెడ్డి, డీఎంహెచ్ఓ సూచనల మేరకు ప్రతి పేషెంట్ను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా తిరిగి పంపించే వరకు మాదే బాధ్యత. మా దవాఖానలో 25మంది అడ్మిట్ అయ్యారు. ప్రతి ఒక్కరినీ మా వైద్యులు, సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు.