2000 Note | సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): పెట్రోల్ బంకులు, జ్యువెల్లరీ, ఆన్లైన్ ఫుడ్ ఆధారిత సేవల్లో ఇప్పుడు 2 వేల నోటుకు డిమాండ్ ఉంది. 2 వేల నోటు పూర్తిగా రద్దు చేయడంతో ఆ నోట్లున్న వారు వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో మార్చుకోవడానికి అవకాశం ఉండటంతో అక్కడ క్యూలైన్లు బిజీగా ఉంటున్నాయి. సమయం ఎక్కువగా అవుతుండటంతో ఈ రెండు వేల నోటును పెట్రోల్ బంకులు, జువెల్లరీ, ఫుడ్ యాప్లలో ఖర్చు చేస్తున్నారు. నగరంలోని హెచ్పీ, ఇండియన్ తదితర పెట్రోల్ బంకుల్లో వాహనదారులు తమ పెట్రోల్, డీజిల్కు 2వేల నోటును ఇస్తున్నారు. అయితే 2వేల నోటు వినియోగం అధికమవ్వడంతో బంకులు కూడా చేతులెత్తేశాయి. రూ.వెయ్యికి పైగా పెట్రోల్ లేదా డీజిల్ పోసుకుంటేనే 2వేల నోటు తీసుకుంటున్నారు.
చిన్న ట్రాన్సక్షన్స్కు చిల్లర ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది తెలిపారు. అయితే 2వేల నోటుకు చిల్లర యూపీఐ, బీమ్, పేటీఎం ద్వారా చెల్లిస్తున్నారు. మా చేతిలో పరిమిత చిల్లర మాత్రమే ఉంటుందని వారు చెబుతున్నారు. మరికొందరు రెండు వేలనోట్లను బంగారం కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇంకొందరు ఫుడ్ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని క్యాష్ డెలివరీ కింద రెండు వేల నోటు ఉపయోగిస్తున్నారు. దీంతో వారి వద్ద ఉన్న 2వేల నోట్లు మార్పిడి అవుతున్నాయి. బ్యాంకుల్లో సమయం ఎక్కువ అవుతుందనుకునే వాళ్లు ఈ పద్ధతిన తమ 2వేల నోటును మార్చుకుంటున్నారని నగరంలోని ఓ జువెల్లరీ షాపు మేనేజర్ తెలిపారు. గతంలో ప్రతి రోజు వారి కొనుగోళ్లలో 2వేల నోటు వాడకం 1-2 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 80 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ 30 వరకు 2 వేల నోటును మార్చుకోవడానికి సమయం ఉంది.