బంజారాహిల్స్, మార్చి 1: ఆభరణాల సంస్థ నిర్వాహకుడిని నమ్మించి.. మోసం చేసిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నంలో నివాసముంటున్న సయ్యద్ సలీముద్దీన్ షేక్పేట సమీపంలోని ద్వారకానగర్లో ‘టీయారా జ్యువెలరీ’ పేరుతో ఆభరణాల షాపు నిర్వహిస్తున్నాడు. ఏడాది కిందట సికిందర్ అనే వ్యక్తి సలీముద్దీన్ నగల దుకాణానికి వచ్చాడు. తాను ఆమెరికాలో ఉంటానని, తనకు కెమికల్స్ పరిశ్రమలు ఉన్నాయని పరిచయం చేసుకున్నాడు. కొన్ని ఆభరణాలు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి తరచూ సలీముద్దీన్కు కాల్స్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత.. తాను గల్ఫ్ ప్రాంతంలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్నానని, నమ్మకమైన భాగస్వామి కోసం చూస్తున్నానని నమ్మబలికాడు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్లో సలీముద్దీన్కు ఫోన్ చేసిన సికిందర్.. తాను కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్కు వచ్చానని, అనుకోకుండా ఓ పెళ్లికి హాజరుకావాల్సి ఉన్నదని చెప్పాడు. తన భార్య ఆభరణాలు తెచ్చుకోలేదని, వెంటనే కొన్ని ఆభరణాలు పంపిస్తే డబ్బులు పంపిస్తానని నమ్మబలికాడు. ఆభరణాలు తీసుకునేందుకు తన కొడుకు అర్జున్ వస్తాడని చెప్పాడు.
మరుసటిరోజు తన కొడుకు అర్జున్ను నగల దుకాణానికి పంపించాడు. సుమారు రూ.24 లక్షల విలువైన 36 తులాల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి.. రూ.4.5లక్షలు అడ్వాన్స్గా చెల్లించాడు. మిగిలిన 18.68 లక్షలు హిమాయత్నగర్లో ఉన్న తన స్నేహితుడి అకౌంట్ నుంచి పంపిస్తామని నమ్మించాడు. కాగా, మరుసటి రోజు నుంచి పలు కారణాలు చెప్పడం ప్రారంభించాడు. తాను అమెరికా వెళ్లిపోయాయని, బ్యాంకులో గన్ షూటింగ్ కారణంగా టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటూ..ఒకసారి, ఇతర తన అకౌంట్ సీజ్ అయ్యిందని మరోసారి గడువు తీసుకున్నాడు. జనవరి 11న కాల్ చేయగా.. తనకు మూడు వారాల గడువు ఇస్తే డబ్బులు పంపిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అతడి కొడుకు అర్జున్కు ఫోన్ చేయగా.. తాను మళ్లీ చేస్తానంటూ కట్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 26న సికిందర్ కొడుకు అర్జున్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తన తండ్రి సికిందర్ చనిపోయాడంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో అతడికి కాల్ చేయగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంది. దీంతో తండ్రీకొడుకులు కలిసి తనను మోసం చేశారంటూ బాధితుడు సలీముద్దీన్ శుక్రవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.