Birth certificate | సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఇన్స్టంట్ అప్రూవల్ విధానంలో మీ సేవ, ఈ సేవ కేంద్రాల నుంచి జారీ అయిన నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన కేసును సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 వేల నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు, ఈ నకిలీ వ్యవహారంలో ఈ సేవ, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కీలకంగా వ్యవహరించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులు మార్చి నెలలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఇన్స్టంట్ అప్రూవల్ విధానం ద్వారా ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల నుంచి 50 కంటే ఎక్కువగా జనన, 100 కంటే ఎక్కువగా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన కేంద్రాలను గుర్తించారు. ఎక్కువగా చార్మినార్ పరిసరాల నుంచే ఈ నకిలీ పత్రాలు జారీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అఫ్జల్గంజ్, అంబర్పేట, ఆసిఫ్నగర్, బహదూర్పుర, చార్మినార్, మొఘల్పుర, సైదాబాద్, యాకుత్పురా, బోయిన్పల్లి, చిక్కడపల్లి, చిలకలగూడ, గోల్కొండ, కాచిగూడ, నల్లకుంట, సైఫాబాద్, షాహినాయత్గంజ్ ప్రాంతాల్లోని 25 కేంద్రాల్లో ఈ-సేవ, మీ-సేవ నిర్వాహకులు ఇన్స్టంట్ అప్రూవల్ విధానాన్ని దుర్వినియోగం చేసి, నకలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 25 మీ సేవ, ఈ సేవ కేంద్రాల నిర్వాహకులను సీసీఎస్ పోలీసులు విచారించారు. ఈ విచారణలో 15 వేల వరకు నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇంకా ఎంత మంది పాత్ర ఉన్నదనే కోణంలో ఆరా తీస్తున్నారు.