మోటార్ వాహన నిబంధనలు తమకేం వర్తించవు అన్నట్టుగా నగరంలో వేలాది మారుతీ వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు, ఆటో డ్రైవర్లు రోడ్లపై యథేచ్చగా పాఠశాల చిన్నారులను ఎక్కించుకొని పరుగులు తీస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలు నిర్వహించే బస్సులకు మోటార్ వాహన చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి. అయితే వాటికి విరుద్ధంగా వాహనాలు లక్షలాది మంది విద్యార్థులను విద్యాసంస్థలకు తరలిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజు నగరంలో సుమారు 20వేల వ్యాన్లు రాకపోకలు సాగిస్తుండగా అందులో 6వేల మందికి పైగా లైసెన్స్ లేని డ్రైవర్లే ఉన్నారని తెలుస్తుంది. గ్రేటర్లో వేలాది మారుతీ, ఓమ్నీ వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు ఆర్టీఏ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఐదు, ఎనిమిది, 16 సీట్ల వ్యాన్లలో 40 మంది చిన్నారులకు పైగా తరలిస్తున్నారు.
– సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థులను తరలించే ఎలాంటి వాహనానికైనా కేంద్ర వాహన చట్టం ప్రకారం సంబంధిత విద్యాసంస్థ అనుమతి ఉండాలి. దాని ఆధారంగా రవాణా శాఖ నుంచి అనుమతి పొందాలి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం విద్యా సంస్థ వాహనానికి ప్రత్యేకంగా పసుపు రంగు వేయాలి. స్కూల్ యాజమాన్యం, రవాణా శాఖ అనుమతి పొందిన తర్వాత ఆ విద్యా సంస్థ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, చిరునామా, ఫోన్ నెంబర్తో పూర్తి వివరాలు వ్యాన్పై కనిపించేలా రాయాలి. వాహనాలకు అత్యవసర ద్వారం ఉండా లి. ఐదుగురు కూర్చోవాల్సిన వ్యాన్లలో 15 మంది వరకు ఎక్కించడం, వాటికి కనీసం పూర్తిస్థాయిలో గాలిని అందించే కిటికీలు లేకపోవడంతో విద్యార్థులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యాన్ యజమానులు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఆర్టీఏ నిబంధనల ప్రకా రం నిర్ణయించిన సీట్లకు ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఏడు సీట్లు దాటినా వాహనం నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.
నిబంధనలకు పాతర..
నగరంలో తిరుగుతున్న వ్యాన్లలో అనుమతికి మించి సీట్లు బిగిస్తున్నా ఒక్క రూపాయి చెల్లించకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వ్యాన్ల యజమానులు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం నిబంధనల మేరకు మారుతి ఓమ్నీ, మెటాడోర్ వంటి వాహనాలను స్కూల్ పిల్లలకు తరలించేందుకు వినియోగించకూడదు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
అధికారులతో కార్మిక నాయకుల కుమ్మక్కు!
నగరంలో అనుమతులు లేకుండా తిరుగుతున్న వేలాది వ్యాన్ల వల్ల కార్మిక నాయకులకు కాసుల పంట పడుతుంది. ప్రతీ మూడు నెలలకోసారి పన్నులు చెల్లించడం, పర్మిట్, లైసెన్స్లు లేని డ్రైవర్, అదనపు సీట్ల బిగింపు నుంచి రవాణా అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కొంతమంది కార్మిక నాయకులు వారి తరపున వకాల్తా పుచ్చుకొని కొందరు అధికారులతో రాయబారం నడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మార్గంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది.