అంబర్పేట, జనవరి 14: సరదాల సంక్రాంతి వచ్చేసింది. ఆనందాల హరివిల్లును ప్రతీ ఇంటా పూయిస్తోంది. సిరుల పొంగులోనూ.. ముగ్గులు గొబ్బెమ్మల సంప్రదాయంలోనూ.. అమృతాల అప్యాయతల్లోనూ.. తానే ఉన్నానంటోంది. ఎటు చూసినా సందడే. తెలుగువారి లోగిళ్లకే పెద్ద ఉత్సవమైన సంక్రాంతిని ప్రజలు అంతే ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది కరోనా తీవ్రతతో చాలా మంది సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నారు. ఈసారి ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ సంబురాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అంబర్పేట నియోజకవర్గంలోని అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం జోరుగా కనిపించింది. తెల్లవారు జాము నుంచే మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవళ్లులను వాల్చారు. ఏ బస్తీ చూసినా ముగ్గులే కనిపించాయి. మహిళలు పోటీ పడి మరీ ఈ ముగ్గులు వేశారు. వారం రోజుల ముందు నుంచే నియోజకవర్గంలో పలువురు ఆజాద్ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి రైతుబంధు సంతోషాలను పంచుతూ పలు డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రజలకు కలిసి యువతతో పతంగులను ఎగురవేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇండ్లపైనా సౌండ్ బాక్స్లు పెట్టుకొని యువత నృత్యాలు చేస్తూ పతంగులు ఎగురవేశారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ ఉత్సవాలు జోరు ఇంకా పెరుగనుంది.