హైదరాబాద్: ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. 7 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని చిలకలగూడ పోలీసులు కోర్టును కోరారు. కాగా, తీన్మార్ మల్లన్న తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి.
ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిలకలగూడకు చెందిన సన్నిధానం లక్ష్శీకాంతశర్మ మారుతీ సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కొందరు భక్తుల రూపంలో ఆయనవద్దకు వెళ్లి సమస్యలు సృష్టిస్తూ సోషల్మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎలక్ర్టానిక్ మీడియా ద్వారా ఆ జోతిష్యాలయంపై అబద్ధ్దాలను ప్రచారం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 19న లక్ష్శీకాంతశర్మకు తీన్మార్ మల్లన్న వాట్సాప్ కాల్చేసి ఈ తప్పుడు ప్రచారం ఆపాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిలింగ్కు దిగాడు. అందుకు శర్మ లొంగలేదు. దాంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా యూట్యూబ్ చానల్స్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రచారం చేశారంటూ మల్లన్నపై ఏప్రిల్ 20న చిలకలగూడ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, పక్కా ఆధారాలుండటంతో మల్లన్నను శుక్రవారం అరెస్ట్ చేశారు. మల్లన్నపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.