నిపుణులైన వైద్యులతో సేవలు
ప్రజారోగ్యం కోసమే బస్తీ దవాఖానలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఘట్కేసర్, జనవరి 13 : స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్కే పరిమితమైన బస్తీ దవాఖానలను సీఎం కేసీఆర్ దూరదృష్టితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజలకు కూడా వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రజలున్న చోటే దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఘట్కేసర్ మున్సిపాలిటీలో బాలాజీనగర్లో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. దవాఖానలో నిపుణులైన వైద్యులు, సిబ్బంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రజలు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బస్తీ దవాఖానకు వస్తున్నారు.
గతంలో ఇబ్బందులు పడేవారు…
మున్సిపాలిటీలోని బాలాజీనగర్ ప్రజలు దవాఖానకు వెళ్లాలంటే రైల్వే గేట్ దాటి పోవాల్సి ఉండేది. ప్రస్తుతం బస్తీలోనే ప్రభుత్వం దవాఖాన ఏర్పాటు చేయడంతో పెద్ద సమస్య తీరింది. దీంతో బస్తీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వైద్యులు మందులిస్తున్నారని, ఆరోగ్య పరీక్షలకు కూడా బస్తీ దవాఖానలో అవకాశం కల్పించాలని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీలో ప్రభుత్వం బస్తీ దవాఖాన ఏర్పాటు చేసింది. ప్రజలకు సుస్తీ చేసినప్పుడు కావాల్సింది మంచి వైద్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. బస్తీ దవాఖాన ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి, జిల్లా వైద్య అధికారులకు కృతజ్ఞతలు.
–ఎం.పావనీ జంగయ్య యాదవ్, చైర్పర్సన్ ఘట్కేసర్ మున్సిపాలిటీ