అబిడ్స్, మే 28 : డివిజన్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంగళ్హాట్ డివిజన్ కార్పొరేటర్ శశికళాకృష్ణ అన్నారు. మంగళవారం గుఫానగర్ ముత్యాలమ్మ టెంపుల్ కమాన్ వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి పాదచారులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆమె ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ సహాయంతో ప్యాచ్ వర్క్ పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు పాత బకాయిలు రూ.1350 కోట్లు చెల్లించకపోవడంతో గుత్తెదారులు పనులు చేయడానికి ముందుకు రావడంలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో రూ. 950 కోట్లు ఉన్న బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రూ. 1350 కోట్లకు చేరిందని ఆమె అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయలేదని అన్నారు. దీంతో స్థానిక కార్పొరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ కాంట్రాక్టర్లతో ప్యాచ్వర్క్ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించి, రద్దు చేసిన పాత టెండర్లను సాంక్షన్ చేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.