హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.92 లక్షల విలువ చేసే 13గ్రాముల కొకైన్తో పాటు బైక్, సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. టోలీచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రఫ్ బేగ్ వృత్తిరీత్యా అరబిక్ ట్యూటర్. వృత్తి పరంగా నైజీరియన్ దేశానికి చెందిన జుదె అలియాస్ క్రిస్తో పరిచయం ఏర్పడింది. క్రిస్ గోవా కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో మహ్మద్ అష్రఫ్ తరచూ గోవాకు వెళ్లి, జుదె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, నగరంలో విక్రయిస్తున్నాడు. డ్రగ్ విక్రయాలకు పాల్పడుతూ 2021లో రాయదుర్గం పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. ఈ సంవత్సరం జూన్లో జైలు నుంచి విడుదలైన తరువాత తిరిగి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడడం ప్రారంభించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటి పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా నిందితుడిపై నిఘా పెట్టారు.
ఈ నెల 25న రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్-65, ఇక్రిసాట్ దగ్గర డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు మహ్మద్ అష్రఫ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 13గ్రాము కొకైన్, 64,340రూపాయల నగదు, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ మేరకు డ్రగ్స్ వ్యాపారిని పట్టుకున్న మాదాపూర్ ఎస్వోటి, స్థానిక పోలీసులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.