అల్వాల్, ఫిబ్రవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి పనులు అల్వాల్లో వేగంగా జరుగుతున్నాయి. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ అల్వాల్తోపాటు గడ్డి అన్నారం, ఎర్రగడ్డలో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. టెండర్లు దక్కించుకున్న కంపెనీ పనులు ప్రారంభించింది. రెండేళ్లలో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు ప్రభుత్వం గడువు విధించింది.
ప్రారంభమైన పనులు..
అల్వాల్లో టెండర్లు దక్కించుకున్న కంపెనీ.. ప్రాథమిక దశ పనులు ప్రారంభించింది. అల్వాల్లో రాజీవ్ రహదారి పక్కనే 28.41 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చదునుచేసి ఆసుపత్రి ని ర్మాణం, పార్కింగ్, తదితర హద్దులు ఏర్పాటు చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
1200 పడకలు.. రూ.897 కోట్లతో..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఏదైనా పెద్ద వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియాతోపాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే వాటి కోసం హైదరాబాద్ లోపలికి రావడం కోసం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీన్ని అధిగమించడానికి నగరానికి నలువైపులా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలకు పూనుకున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలో నిర్మాణం పూర్తి కాగా.. అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డలో పనులు ప్రారంభం అయ్యాయి. అల్వాల్లో 1200 పడకల సామర్థ్యంలో నిర్మాణం చేపడుతున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.897 కోట్లు మంజూరు చేసింది. 28.41 ఎకరాల్లో గ్రౌండ్ ఫ్లోర్తోపాటు 5 అంతస్తుల్లో ఈ నిర్మాణం జరగనుంది.
ఉత్తర తెలంగాణ ప్రజలకు వరం..
హైదరాబాద్కు అల్వాల్ ఉత్తర ద్వారం లాంటిది. రాజీ వ్ రహదారి మీదుగా సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు కూడా ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తారు. ఆయా జిల్లాలవారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రావాలంటే అల్వాల్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. అల్వాల్ నుంచి జేబీఎస్, సికింద్రాబాద్ వెళ్లడానికి భారీ ట్రాఫిక్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ దవాఖాన అందుబాటులోకి వస్తే ఏ సమస్య ఉండదు. జిల్లాల నుంచి వచ్చినవారు ఇక్కడే అత్యాధునిక వైద్యం పొంది వెళ్లిపోవచ్చు.
రెండేళ్లలో పూర్తి చేయిస్తాం..
ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయి. నిర్మాణానికి కూ డా అన్ని అనుమతులు ల భించాయి. త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు సూచించాం. రెండేళ్ల లో అల్వాల్ మెడికల్ హబ్ గా మారనుంది. 1200 పడకల ఆసుపత్రిని మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లో నిర్మించడానికి నిర్ణయించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఈ ఆసుపత్రి వరప్రదాయిని గా మారనుంది.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే