ఖైరతాబాద్, డిసెంబర్ 11 : కేబినేట్ మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా ప్రజలకు విశేష సేవలందించిన దివంగత కొణిజేటి రోశయ్య మచ్చలేని మహోన్నత వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. వాసవీ సేవా కేంద్రం, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కొణిజేటి రోశయ్య సంస్మరణ సభ లక్డీకాపూల్లోని వాసవీ సేవా కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేశ్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, వీ3 న్యూస్ సీఎండీ కాచం సత్యనారాయణతో కలిసి రోశయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణానంతరం క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసి శాంతియుత వాతావరణం నెలకొల్పారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుధీర్ఘకాలంగా ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారన్నారు. ఆర్యవైశ్య సంఘాలు పిలిస్తే ఎంత మంది ఉన్నారని చూడకుండా ఎంత దూరమైన వెళ్లి, వారిని ఆశీర్వదించేవారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని ఆర్యవైశ్య సంఘాల పరిధిలోని వైశ్య భవన్లలో రోశయ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రోశయ్య అంటే ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రోశయ్య స్మారకార్థ్ధం స్మృతి వనం, కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ సేవా కేంద్రం అధ్యక్షుడు ఆలంపల్లి రవికుమార్, ప్రధాన కార్యదర్శి కొల్పూరు రమేశ్, కోశాధికారి పంపాటి జ్ఞానచందర్, జీవితకాలపు సభ్యులు కొండ్లె మల్లికార్జున్, కూర రఘువీర్ పాల్గొన్నారు.