మంచిరేవుల వద్ద 100 హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్
కేబీఆర్ పార్కు తరహాలో.. ఐటీ కారిడార్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్
100కు పైగా హెక్టార్ల విస్తీర్ణంలో, ఓఆర్ఆర్ను ఆనుకొని ఏర్పాటు
4 కి.మీ పొడవునా వాకింగ్ ట్రాక్
సందర్శకులను ఆకట్టుకోనున్న కొండల నడుమ చెరువు
కుటుంబ సమేతంగా వచ్చి సేద తీరేలా ఏర్పాట్లు
సిటీబ్యూరో,జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి.. వెరసి నగర వాసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి నగర వాసులకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు కల్పించేందుకు గ్రేటర్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను అర్బన్ పార్కులుగా తీర్చిదిద్దుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నారు. తాజాగా నగరానికి పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తున్న ఐటీ కారిడార్లో సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దుతున్నది.
కేబీఆర్ పార్కు తరహాలో..
కాంక్రీట్ జంగిల్గా మారుతున్న మహానగరంలో అటవీ ప్రాంతాలు నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నగరం నడిబొడ్డున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్కు తరహాలోనే ఐటీ కారిడార్లోని కోకాపేట, పుప్పాల్గూడ, నానక్రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్, నార్సింగి ప్రాంతాలకు సమీపంలో ఉన్న మంచిరేవులలో సుమారు 100 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ఈ అటవీ ప్రాంతం చిలుకూరు మృగవని అటవీ ప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. కాని ఓఆర్ఆర్ దాని మధ్యలోనుంచే వెళ్లడంతో రెండుగా విడిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు రావడంతో నగరంలోని కేబీఆర్ పార్కు తరహాలో దీన్ని అభివృద్ధి చేసి, నగర వాసులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పార్కులో ఏర్పాటు చేస్తున్న వసతులు..