సుల్తాన్బజార్, డిసెంబర్ 17 : వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొందరు వాహనదారులు ఇష్టం వచ్చిన విధంగా పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కోవకు చెందినదే పురానాపూల్ నుంచి జియాగూడ మేకలమండి మీదుగా వెళ్లే రహదారి. ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనే.. రాష్ట్ర ప్రభుత్వం మూసీనదిని ఆనుకొని 100 ఫీట్ల రహదారిని నిర్మించింది.
జాతీయ రహదారిపై ఉన్న జియాగూడ మేకలమండికి వచ్చే ప్రజలు తమ వాహనాలను రహదారి పైనే నిలిపివేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి. హై టెక్ సిటీ, శంషాబాద్ ఏయిర్ పోర్ట్ ప్రాంతాలకు వెళ్లే వాళ్లకు శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీని ఎదుర్కొంటున్నారు. రహదారిలో వైన్స్, బార్లు, దుకాణాల షెడ్లు, గొర్రెలు, మేకల గోదాంలు ఉన్నాయి. సంబంధిత అధికారులు, గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
నిబంధనలు పాటించకుంటే చలానా విధిస్తున్నాం : ధనలక్ష్మి, గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహన దారులు, నిబంధనలు పాటించని వారికి చలానాలు విధిస్తున్నాం. గొర్రెలు కొనుగోలు చేసేందుకు వచ్చే కొనుగోలుదారులు వాహనాలు నిలుపడంతో సమస్య ఉత్పన్నమవుతున్నది. నిత్యం గస్తీ నిర్వహిస్తున్నాం. రహదారిపై నిలిపిన వాహనాలను లిఫ్ట్ చేసి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేస్తున్నాం. త ్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.