చివరి రోజు రూ. 100కోట్లు దాటిన కలెక్షన్లు
సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు రికార్డును సృష్టించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ. 742.41 కోట్ల ఆదాయాన్ని బల్దియా సమకూర్చుకున్నది. ఐదు శాతం రాయితీతో ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వారికి ఆర్థిక ప్రయోజనం కలిగింది.
అందువల్లే పన్ను చెల్లింపునకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చారు. 30 సర్కిళ్ల పరిధిలోని సీఎస్సీ సెంటర్లు, బిల్ కలెక్టర్లు, మీ సేవ, ఆన్లైన్ల ద్వారా రూ. 600 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, రికార్డు స్థాయిలో సుమారు 7.50 లక్షల మంది నుంచి రూ. 742.41 కోట్ల ఆదాయం రావడం రికార్డును సృష్టించింది. ఇంత స్పందన రావడంతో ఇదే ప్రప్రథమని అధికారులు పేర్కొన్నారు.