హైదరాబాద్ : న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నారు. మద్యం సేవించి, వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. మద్యం సేవించి బండి నడిపితే మొదటిసారి రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి దొరికితే రూ. 15 వేలు జరిమానా, 2 సంవత్సరాల శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైస్సెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్కు రవాణా శాఖకు పంపుతామని చెప్పారు. మొదటిసారి 3 నెలల సస్పెన్షన్, రెండోసారి దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు.
రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్హౌస్ పైవంతెనలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను నిషేధించారు.
ఇక ఎయిర్పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్ప్రెస్ వే మీద నుంచి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.