సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : ఫిర్యాదుదారుడికి రూ.10 లక్షలు చెల్లించాలని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈస్ట్ మారేడుపల్లికి చెందిన రామస్వామి బైపాస్ సర్జరీ కోసం ఏప్రిల్ 6, 2021లో బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ దవాఖానలో చేరాడు. శస్త్రచికిత్స తర్వాత రోగిని ఐసీయూలో ఉంచారు. అటు నుంచి వార్డుకు తరలించారు. రెండు రోజుల తర్వాత రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే రక్తస్రావం జరిగిందని కుటుంబీకులు పేర్కొనడంతో తిరిగి ఐసీయూకి తరలించి పరీక్షలు చేయగా, కొవిడ్, న్యుమోనియా ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యం మరింత దిగజారడంతో ఏప్రిల్ 19, 2021న రోగి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే రోగికి దవాఖానకు రాకమునుపు కొవిడ్ సోకలేదని, దవాఖాన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే కొవిడ్ సోకిందని, మృతుడి కొడుకు రామ్కుమార్ పేర్కొన్నారు.
దవాఖాన సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించలేదని మృతుడి కుమారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1లో ఆధారాలతో నిరూపించారు. కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ కేసు వివరాలను పరిశీలించిన అనంతరం.. రోగి ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత వహిస్తూ.. ఫిర్యాదుదారుడికి పరిహారం రూ.10లక్షలు చెల్లించాలని కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద రూ.20వేలు అందజేయాలని, కోర్టు ఆదేశాలను 45 రోజుల్లో పాటించాలని సూచించింది.