సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నగదు మార్పిడితో 20 శాతం అదనంగా డబ్బు వస్తుందనే ఆశతో రూ.1.9 కోట్లు పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను పట్టుకొని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాచకొండ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. సంతోష్నగర్, రక్షపురం కాలనీకి చెందిన ఎడులకంటి ప్రభాకర్ గౌడ్(51) వ్యాపారి. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మహబూబ్(40), నార్సింగి ప్రాంతానికి చెందిన కొలంపల్లి శ్రీనివాస్(45), ఉప్పల్లోని భరత్నగర్ కాలనీకి చెందిన బింగి వాసు(44), ఎల్బీనగర్కు చెందిన సింగంశెట్టి రాములు(40) ముఠాగా ఏర్పడి నగదు మార్పిడి పేరుతో అమాయకులను మోసం చేయాలని పన్నాగం పన్నారు.
వీరంతా ప్రభాకర్గౌడ్ వద్దకు వెళ్లారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం రూ.2వేలను రద్దు చేస్తున్నదని.. మా దగ్గర రూ.1.9 కోట్లు ఉన్నాయని.. రూ.2వేల నోట్లకు బదులు రూ.500లు ఇస్తే 20 శాతం కమిషన్ ఇస్తామని ప్రభాకర్గౌడ్ను నమ్మించారు. ఇది నమ్మిన ప్రభాకర్ తన వద్ద ఉన్న నగదుతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద రూ.1.9 కోట్లను సేకరించి శనివారం ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద నిందితుల ముఠాను కలిశాడు. వారు ఈ నగదు తీసుకొని పది నిమిషాల్లో రూ.2 వేల నోట్ల కరెన్సీ ఇస్తామని అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారు ఎంతకూ రాకపోవడం.. ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. రూ.1.9 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు. సకాలంలో స్పందించి నిందితులను పట్టుకున్న ఎల్బీనగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్తో పాటు జోన్ బృందాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ అభినందించారు.