దుండిగల్, డిసెంబర్ 1: హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలలుగా సీజ్ చేసిన మాదకద్రవ్యాలను గురువారం దుండిగల్లోని రాంకీ సంస్థలో పోలీసులు నిర్వీర్యం చేశారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన పలు దాడుల్లో దొరికిన 1.5 టన్నుల గంజాయి, 1.5 లీటర్ల హాష్ ఆయిల్, 1.5 కిలోల ఎండీఎంల్ 50 ఎంజీ టాబ్లెట్లు (సింథటిక్ డ్రగ్స్) ను నిర్వీర్యం చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ మాట్లాడుతూ.. అనేక రకాల నేరాలకు కారణమవుతూ, యువత జీవితాలను నాశనం చేస్తున్న నిషేధిత మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఎక్కడైనా, ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు, సేవిస్తున్నట్లు తెలిసినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, రాంకీ సిబ్బంది పాల్గొన్నారు.