సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీని నగర వ్యాప్తంగా చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50వేల విగ్రహాలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది విగ్రహాల పంపిణీలోని పాల్గొని ప్రజలకు ఉచితంగా అందజేసి, మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు.
మాదాపూర్ శిల్పారామం వద్ద హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. గత మూడు రోజులుగా మొత్తం 80వేల విగ్రహాలను పంపిణీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్.కె.మీరా, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ ఇంజినీర్లు పరంజ్యోతి, యూసుఫ్ అలీ ఇతర అధికారులు పాల్గొన్నారు.