కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజాప్రభాకర్
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 18 : పద్మశ్రీ రైతు చింతల వెంకట్రెడ్డి అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలతో ఆరోగ్యం లభిస్తుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజాప్రభాకర్ అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందన్పల్లిలోని చింతల వెంకట్రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం ఉద్యానవన అధికారులతో కలిసి సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలోని 20 ఎకరాల్లో పలు రకాల ద్రాక్ష తోటలను పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలను వెంకట్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో చింతల చేస్తున్న విధానాలు, అనుసరిస్తున్న ప్రయోగాలతో పంటలను పండిస్తామని, రైతులు సేంద్రియ విధానాలు పాటించి భూమిని, ప్రకృతిని కాపాడాలన్నారు.
నేటి కాలంలో ఎక్కువ మంది ప్రజలు సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలపై శ్రద్ధ కనబరుస్తున్నారని, కూరగాయలు, తదితర పంటలను కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఎరువులు వేయకుండా మట్టి, నీరుతో పంటలు పండిస్తున్న వెంకట్రెడ్డిని ఆమె అభినందించారు. నాణ్యత తెలుసుకునేందుకు పలు రకాల ద్రాక్ష పండ్లను విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు. 20 ఏండ్లుగా తాను చేస్తున్న వ్యవసాయ విధానాన్ని అధికారులకు వెంకట్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ఎ.భగవాన్, ఎ.కిరణ్కుమార్, విజయ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.