మేడ్చల్, మార్చి17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు భరోసాను కల్పిస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, అంబేద్కర్ విదేశీ విద్యానిధి, స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు, దళితబంధు, రజక, నాయీబ్రాహ్మణుల దుకాణాలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఆసరా పింఛన్లు
జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు ప్రతి నెల రూ. 36.62 కోట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్నది. 1,48,025 మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ. 439 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు లబ్ధిదారులుగా ఉన్నారు.
రైతుబంధు :
రైతుబంధు పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా రైతులకు రూ. 343.42 కోట్లను ప్రభుత్వం అందించింది. ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రూ. 39.74 కోట్ల చొప్పున రైతుల ఖాతాలలో నగదును జమ చేస్తున్నది. రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల ప్రమాదబీమా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నది. రైతు బీమాకు అవసరమయ్యే నగదును ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తున్నది.
అంబేద్కర్ విదేశీ విద్యానిధి
అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకానికి ప్రభుత్వం రూ. 216 కోట్ల నిధులను ఖర్చు చేసింది. జిల్లా నుంచి విదేశాలలో చదువుకునేందుకు వెళ్లిన 280 మంది విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలలో ఫీజులను ప్రభుత్వం చెల్లించింది. ప్రతి ఏడాదికి జిల్లా నుంచి విదేశాలలో చదువుకునేందుకు 40 మంది విద్యార్థులు వెళుతున్నారు. ఫీజుతో పాటు విమానచార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్
జిల్లా వ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి ప్రభుత్వం రూ. 493 కోట్ల నిధులను లభ్ధిదారులకు అందించింది. జిల్లాలో 52,816 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను వర్తింపజేశారు. అర్హూలైన వారందరకీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా పెండ్లి చేసిన అమ్మాయి తల్లి ఖాతాలో లక్ష 16 వేల రూపాయలను అందిస్తున్నది.
మహిళా సంఘాలకు రుణాలు
జిల్లాలో 2,970 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ గ్రూప్లకు రూ. 417.5 కోట్ల రుణాలను ప్రభుత్వం మంజూరీ ఇప్పించింది. ప్రతి ఏడాది రుణాలను పెంచుకుంటూ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది.
సెలూన్, లాండ్రీలకు ఉచిత విద్యుత్
నాయీబ్రాహ్మణులు, రజకులు ఏర్పాటు చేసుకున్న సెలూన్, లాండ్రీలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ను అందించేందుకు రూ. 5.63 కోట్లను ట్రాన్స్కోకు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 6,954 మంది నాయీబ్రాహ్మణ, రజకులు లబ్ధిపొందుతున్నారు.
దళితబంధు
జిల్లా వ్యాప్తంగా దళితబంధు లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 56. 30 కోట్ల నిధులను అందించింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, సనత్నగర్ నియోజకవర్గాలకు చెందిన 563 మంది లబ్ధిదారులకు ఒక్క లబ్ధిదారునికి రూ. 10 లక్షల చొప్పున రూ. 56. 30 కోట్లను ప్రభుత్వం అందించింది.
కేసీఆర్ సార్ సల్లగుండాలే
కూలీ పనులు చేసే తాము తమ బిడ్డ పెండ్లి ఎట్లా చేస్తామోనని బెంగపడ్డాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయతో మా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి వచ్చింది. ఆ పైసలు మాకు ఎంతో ఆసరైనయి. అయినవాళ్లు కూడా ఇవ్వనివిధంగా మేనమామగా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ లక్ష 16 వేలు ఇచ్చిండు. సారు సల్లగుండాలే.
–వడ్డెర లక్ష్మి, కీసర
ప్రజలు ఆనందంగా ఉన్నారు
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లక్షలాది మందికి అందుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు.
– కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
షాదీముబారక్ బాగుంది
మైనార్టీ వర్గాల పిల్లల పెండ్లీలకు షాదీముబారక్ ద్వారా అందిస్తున్నారు. ఇది చాలా మంచి పథకం. ఖర్చు పెట్టి పెండ్లి చేయలేని నిరుపేదలకు షాదీముబారక్ పథకం ద్వారా వచ్చే రూ. లక్ష 16వేలు ఉపయోగపడుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దవలే అండగా నిలుస్తున్నాడు. సార్కు రుణపడి ఉంటాం.
–రిజ్వాన
ఆసరాతో సంతోషంగా ఉన్నా..
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పింఛను అందించి ఆసరాగా నిలుస్తుండు. నాకు వచ్చే పింఛనుతో ఎవరిపై ఆధార పడకుండా మందులు, ప్రయాణలకు పింఛను పైసలను ఖర్చు చేసుకుంటున్నాను. నెల నెలా తప్పకుండా పింఛను బ్యాంకు ఖాతాలో పడుతుంది. ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఉన్నాను.
– భారతమ్మ, జగన్గూడ
ఆసరా అయింది
ఎలాంటి ఆదాయ వనరులు లేని నాకు ఆసరా పింఛను ఆదుకుంటుంది. చిల్లర దుకాణం ద్వారా వ్యాపారం చేస్తూ ఇద్దరి పిల్లలను పోషించడం, ఇంటి కిరాయి కట్టడం భారంగా మారింది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛను నా జీవితానికి ఆసరా అయింది.
–పందిరి శశికళ, ఎన్ఎఫ్సీనగర్
రైతుల పాలిట దేవుడు
రైతును రాజును చేస్తామని గత ప్రభుత్వాలు కల్లిబొల్లి మాటలు చెప్పి కాలం గడిపాయి. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టకున్నాడు. ప్రతి ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలు రైతుబంధు ఇచ్చి రైతులను అప్పుల పాలు లేకుండా చేస్తుండు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందిస్తుండు. రైతులందరూ కేసీఆర్ను మరిచిపోరు.
– ఇంద్రారెడ్డి, రైతు, ఎదులాబాద్
ఎవరిపైనా ఆధారపడకుండా..
ఎవరిపైనా ఆధారపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇస్తున్న పింఛనుతో అవసరాలను తీర్చుకుంటున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తీరగకుండానే బ్యాంక్ ఖాతాలలో పింఛను పైసలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నిరుపేదలు సంతోషంగా ఉన్నారు.
– బీ. కమలమ్మ, రాంపల్లి