సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ఫోన్కు అనుకోకుండా వచ్చిన ఓ మిస్డ్ కాల్తో దగ్గరయ్యారు.. కలిసి ఉండలేక.. విడిపోలేక ప్రాణాలు వదిలేయాలని నిర్ణయించుకున్నారు.. ఒకేసారి ఓ మందుల దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. ఒకరి తరువాత మరొకరు ప్రాణాలు వదిలేశారు. ఇటీవల హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన జంట మరణాలకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గురువారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ జంట మరణాలపై రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ రెండు మరణాలు ఆత్మహత్యగా భావిస్తున్నామని, ఇంకా విచారణ పూర్తికాలేదని సీపీ తెలిపారు.
ములుగు జిల్లాకు చెందిన అల్లావుల రాజేశ్(25) ఇబ్రహీంపట్నంలోని శ్రీహిందూ కాలేజీలో 2021లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చి చైతన్యపురిలోని తన స్నేహితుడు సాయి ప్రకాశ్తో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు.
ఏడాది కిందట హయత్నగర్లోని సిద్ధివినాయకనగర్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన బత్తుల సుజాతకు అనుకోకుండా మిస్డ్ కాల్ చేయడంతో.. ఆమె తిరిగి రిైప్లె ఇచ్చింది. మొదట్లో ఇద్దరు మెసేజ్లు పంపించుకున్నారు.. ఆ తరువాత ఇద్దరి మధ్య స్నేహం కుదిరి, చిట్చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
సుజాత తరుచూ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఎవరితో ఇలా మాట్లాడుతుందని అనుకున్నారు.. ఇంతలో 15 రోజుల కిందట సుజాత అనారోగ్యానికి గురికావడంతో ఆమె వాట్సాప్కు చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. అనారోగ్యం కారణంగా ఆమె ఆ ఫోన్లను ఎత్తలేకపోయింది. ఈ క్రమంలోనే గత నెల 24వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమె విషం తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించారు.
సుజాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాజేశ్ 25వ తేదీన ఆమె ఇంటి వద్దకు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటం.. సుజాత గూర్చి ఆరా తీస్తుండడంతో ఆమె కూతురు శివానికి అనుమానం వచ్చింది. 26వ తేదీన రాజేశ్ తిరిగి సుజాత ఇంటి వద్దకు వెళ్లి ఆమె కూతురు శివానితో పక్కింటి వారి గురించి ఆరా తీశాడు. చివరకు రాజేశే తన తల్లిని ఫోన్లో వేధిస్తున్నాడని కొడుకు జయచంద్ర నిర్ధారించుకొని, అతడిపై చేయిచేసుకున్నాడు. అక్కడ గొడవ వద్దని టీ స్టాల్ యజమాని చెప్పడంతో అక్కడి నుంచి రాజేశ్ను తీసుకొని వెళ్లిపోయారు. సాయంత్రం 5.3 గంటలకు రాజేశ్ను హెచ్చరించి, వార్డ్ అండ్ డెడ్ స్కూల్ వద్ద వదిలేసి అందరూ వెళ్లిపోయారు.
సుజాత, రాజేశ్లు 24వ తేదీన కలుసుకున్నారు..అదేరోజు సాయంత్రం 5.25 గంటలకు కుంట్లూరు ఎక్స్రోడ్డులోని రాఘవేంద్ర ఆగ్రో ఏజెన్సీ దుకాణం వద్ద ఒక బాటిల్ పురుగుల మందు తీసుకున్నారు, దానిని సుజాత తన వెంట తీసుకెళ్లింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి రిలియన్స్ మార్ట్ వద్దకు వెళ్లారు. సాయంత్రం 8:16 గంటల వరకు కలిసి ఉన్నట్లు సీసీ ఫుటేజీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే 24న రాత్రి సుజాత, 26వ తేదీ రాత్రి రాజేశ్ పురుగుల మందు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
రాజేశ్ మృతదేహం బయటపడటంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అక్కడ పడేశారనే అనుమానంతో ముందుగా హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. చనిపోయిన తరువాత రెండు రోజులకు గాని మృతదేహం బయటపడిందని, దీంతో శరీరం లోపల ఉన్న పాయిజన్ ఎంటీ అనే విషయంలో స్పష్టతలేదని, అందుకే విస్రా ఫలితాలు రావాల్సి ఉందని సీపీ తెలిపారు. పోస్టుమార్టం ప్రాథమిక వివరాలు, సాంకేతిక విశ్లేషణతో ఈ కేసులో రాజేశ్ది ఆత్మహత్యగా ఒక అంచనాకు వచ్చామని సీపీ వివరించారు. ఇదిలా ఉండగా సుజాత, రాజేశ్తో ఏర్పడిన పరిచయంతో మానసికంగా కృంగిపోయింది. తాను తప్పు చేస్తున్నానని, తన రిలేషన్ను ఇంకా కప్పి పుచ్చలేనని, బయటకు చెప్పుకోలేని పరిస్థితి, పెండ్లయి, ముగ్గురు పిల్లలు ఉండటంతో తనకు తానుగా కుమిలిపోయి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసుల విచారణలో ఒక అంచనాకు వచ్చామని వివరించారు.