హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): గోదావరి నదికి పోటెత్తిన వరదలపై ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వరద బాధితులకు సాయం అందజేస్తుంటే.. విపక్ష నేతలు మాత్రం పార్టీ ఆఫీసుల్లో మీడియా ముందు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పంప్హౌస్లు ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న ఇంగితజ్ఞానం లేకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు అవి మునిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాంచేయాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్షాలకు మరొకటిలేదని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ వరదసాయం ఏమైందని ప్రశ్నించారు. గుజరాత్కు తప్ప తెలంగాణకు సాయం చేయదా? అని నిలదీశారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాట వరసకైనా తెలంగాణకు వరదసాయం చేయాలని కేంద్రాన్ని ఎందుకు అడగటంలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు 64.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు రూ.7,372.56 కోట్లు జమ చేశామని, త్వరలోనే మిగతావారికీ పంపిణీ పూర్తవుతుందని చెప్పారు.