ఆదిబట్ల, ఆగస్టు 31: భవిష్యత్ తరాలకు ఆధునిక గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి అన్నారు. కొంగరకలాన్ గ్రామంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ నిర్మించిన సామాజిక గ్రంథాలయ భవనాన్ని సంస్థ ఆసియా రీజినల్ హెడ్ జాన్ బ్రయర్, మున్సిపల్ చైర్ పర్సన్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది గ్రంథాలయాల వినియోగం తగ్గుతూ వచ్చిందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా రూ. 18 కోట్లతో గ్రంథాలయాల భవనాల నిర్మాణం జరుగుతున్నదన్నారు. గ్రంథాలయాలకు డిజిటల్ టెక్నాలజీ హంగులు కల్పించడంతో పాటు ఉపాధి కల్పనా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. అమెజాన్ సంస్థల సహకారంతోపాటు ప్రభుత్వ సహకారం మెండుగా లభిస్తుండటంతో జిల్లాలో వందకు పైగా గ్రామీణ గ్రంథాలయాలను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అనంతరం కొంగరకలాన్లో బస్స్టాండ్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు మహేందర్, వనం శ్రీను, నీళ్ల హరిదాస్ గౌడ్, వైస్ చైర్మన్ కోర్రె కలమ్మ, కోల నాగేశ్, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, అమేజాన్ ప్రతినిధులు వరుణ్, సాజీ, అవినాశ్, పార్థసారధి, సురేశ్, నాయకులు కోర్రె జంగయ్య, కాకి రవీందర్, ముక్కెర నారాయణ, ఉడుతల అశోక్గౌడ్, కాకి వేణు, యాదగిరి గౌడ్, శ్రీనివాస్గౌడ్, ప్రవీణ్, మధు, పవన్ తదితరులు పాల్గొన్నారు.