మన్సూరాబాద్, ఆగస్టు 8: వివేకానందనగర్ కాలనీలో బిల్డర్ల నిర్లక్ష్యం వలన తలెత్తిన డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి వివేకానందనగర్ కాలనీ ఫేజ్-1, 2, సహారాస్టేట్స్కాలనీ, హిమపురికాలనీల్లో సోమవారం ఉదయం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డితో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి అక్కడి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళికలు లేకుండా వివేకానందనగర్ కాలనీలో బిల్డర్లు అపార్ట్మెంట్లను నిర్మించి అందులోని డ్రైనేజీని రోడ్లపైకి వదులుతున్నారని తెలిపారు. రోడ్లపై వదిలిన మురుగునీటి దుర్వాసనతో సహారాస్టేట్స్కాలనీ కల్యాణి అపార్ట్మెంట్స్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నూతనంగా ఏర్పాటు చేయాల్సిన డ్రైనేజీ వ్యవస్థపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎల్బీనగర్లో ఇప్పటికే కోట్లాది రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వరదనీటి ట్రంకులైన్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని.. నూతనంగా ఏర్పాటు చేస్తున్న వరదనీటి నాలాల వలన వరదముంపు సమస్యలకు విముక్తి లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీశ్యాదవ్, టంగుటూరి నాగరాజు, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, సిద్దగోని జగదీశ్గౌడ్, ఆనంద్, భాస్కర్యాదవ్, వివిధ కాలనీల ప్రతినిధులు శ్యాంసుందర్ రెడ్డి, రాములు గౌడ్, పురుషోత్తం, కరణం శ్రీకాంత్, వల్లూరిపల్లి పార్థసారధి, సయ్యద్ జానీ, గంగదాసు కృష్ణారెడ్డి, కన్నా మహేశ్, బెల్లంకొండ నాగభూషణం, డాక్టర్ వెంకటేశ్వర్లు, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.