సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ): ఎస్ఆర్డీపీ, హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మంగళవారం కమిషనర్ ఆర్వీ.కర్ణన్ జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో చేపడుతున్న ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ, హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల పురోగతిపై జోనల్ కమిషనర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్లానింగ్, ఇరిగేషన్, భూ సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్టు పురోగతిని కమిషనర్కు వివరించారు.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ప్రతిబంధకాలు, క్షేత్రస్థాయి సవాళ్లు, పెండింగ్ పనుల కారణాలను తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పూర్తికి కమిషనర్ ఆర్వీ.కర్ణన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పురోగతిలో ఉన్న ముసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి, నల్గొండ ఎక్స్ రోడ్డుపై ఫ్లై ఓవర్ పనులను మిషన్ మోడ్లో చేస్తూ జూన్ 2 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జి.ముకుందారెడ్డి, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.