సిటీబ్యూరో : పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. బుధవారం నగరంలోని 23 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేశారు. మరిన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మట్టి విగ్రహాలను గురువారం సైతం పంపిణీ చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. సుమారు రూ.23లక్షల వ్యయంతో 70వేల మట్టి విగ్రహాలను తయారు చేయించి.. పంపిణీ చేస్తున్నామని, నగర వాసులు మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని అధికారులు సూచించారు.
తార్నాక హుడా కాంప్లెక్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మేయిన్ గేట్, సికింద్రాబాద్లోని గణేశ్ టెంపుల్ దుర్గం చెరువు, కేబీఆర్ పార్క్, మైండ్ స్పేస్ జంక్షన్, కుందన్బాగ్, అమీర్పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం, మైత్రీవనం స్వర్ణజయంతి కాంప్లెక్స్, ఉప్పల్ శిల్పారామం ప్రాంతాల్లో.. అదేవిధంగా మొబైల్ బృందాల ద్వారా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో, అపార్టుమెంట్ల వద్ద పంపిణీ చేశామని, గురువారం సైతం మట్టి విగ్రహాల పంపిణీ ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు వివరించారు.