బంజారాహిల్స్,ఆగస్టు 12 : క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు కాజేశారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 11లో నివాసం ఉంటున్న బిల్డర్ సలీమ్ బిన్ మహ్మద్ క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గిందని మెసేజీ వచ్చింది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇండస్ ఇండ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో వెతికాడు.
దాంతో ఒక టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేయగా అది కనెక్ట్ కాలేదు. వెంటనే గుర్తుతెలియని వ్యక్తి సలీమ్ బిన్ మహమ్మద్కు ఫోన్ చేసి తాము ఇండస్ ఇండ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు లిమిట్ను రూ.2లక్షలకు పెంచాలంటే అతడి అకౌంట్లో రూ.62వేలు ఉండాలని సూచించాడు. దాంతో తనకున్న యాక్సెస్ బ్యాంక్ అకౌంట్నుంచి రూ.62వేలను ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాలోకి పంపించాడు.
బ్యాలెన్స్ పడిన కొంతసేపటికే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నామని, ఓటీపీ నెంబర్ ద్వారా నిర్ధారణ చేయాలంటూ అతడికి మరో మెసేజీ వచ్చింది. లింక్ను ఓపెన్ చేయగానే అతడి ఖాతాలోంచి రూ.62వేలు డ్రా అయ్యాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.